EducationTelanganaTop NewsUncategorized

తెలంగాణ ఆర్టీసీ అప్డేట్ బ్రేకింగ్ న్యూస్ || తెలంగాణ ఆర్టీసీ తాజా వార్త

 

 

మూడు రోజుల్లో వందకు వందశాతం ఆర్టీసీ బస్సులు నడిచితీరాలని, ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లుచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

చట్టవిరుద్ధంగా జరుగుతున్న సమ్మెను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తించదని, సమ్మె చేస్తున్నవారితో చర్చలు కూడా జరుపదని స్పష్టంచేశారు. తమంతట తాముగా అనధికారికంగా విధులకు గైర్హాజరైనవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకొనే ప్రసక్తేలేదని ప్రకటించారు. సమ్మెలో పాల్గొనకుండా విధులు నిర్వర్తిస్తున్నవారికి సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. 50% ఆర్టీసీ సొంత బస్సులు నడిపించడానికి అవసరమైన సిబ్బందిని వెంటనే నియమించాలని, 30% బస్సులను అద్దె ప్రాతిపదికన నడిపించాలన్నారు. 20% ప్రైవేటు బస్సులకు స్టేజ్ క్యారేజీలుగా రూట్ పర్మిట్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బస్సులు వందశాతం పునరుద్ధరించటానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉండటంతో విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు దసరా సెలవులను ఈ నెల 19 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీ సమ్మెవల్ల ఉత్పన్నమైన పరిస్థితులపై సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ఆదేశాలు, సూచనలు.. ఆయన మాటల్లోనే..
సిబ్బందిని వెంటనే భర్తీ చేయాలి

ఆర్టీసీలో వందకు వందశాతం బస్సులను పునరుద్ధరించాలి.

ఇందుకోసం అవసరమైన సిబ్బందిని వెంటనే తీసుకోవాలి. రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్లు, రిటైర్డ్ పోలీస్ డ్రైవర్లను ఉపయోగించుకోవాలి. బస్సులు, భారీ వాహనాలు నడిపిన అనుభవం కలిగినవారిని పనిలోకి తీసుకోవాలి. అధికారులు రేయింబవళ్లు పనిచేసి, మూడురోజుల్లో వందకు వందశాతం బస్సులు నడిచేలా చూడాలి. ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన ప్రకారం ఆర్టీసీలో 50% (5,200) సంస్థ సొంత బస్సులు నడుపాలి. 30% (3,100) అద్దె బస్సులు నడుపాలి. ఇందులో ఇప్పటికే 21% ఉన్నాయి. మరో 9% బస్సులకోసం వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి. 20% (2,100) ప్రైవేటు బస్సులకు స్టేజ్ క్యారేజీలుగా రూట్ పర్మిషన్లు ఇవ్వాలి. దీనికోసం అవసరమైన కసరత్తు చేయాలి.

యూనియన్ నాయకుల వల్లే ఉద్యోగాలు పోయాయి

యూనియన్ నాయకుల పిచ్చి మాటలు నమ్మి.. కార్మికులు అనధికారికంగా గైర్హాజరై తమంతట తామే ఉద్యోగాలు వదులుకున్నారు. అంతేతప్ప ఎవరినీ ఎవరూ డిస్మిస్ చేయలేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సూపర్‌వైజర్లను కూడా సమ్మెలోకి లాగారు. యూనియన్ నాయకులు అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించి 48వేల మంది ఉద్యోగాలు పోయేలాచేశారు. విధులకు హాజరుకానివారిని తిరిగి తీసుకొనే అవకాశమేలేదు. వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదు. ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. పండుగ సమయంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేసి, ఆర్టీసీని నష్టపరిచిన కార్మికులను క్షమించేది లేదు. వారు చేస్తున్నది సమ్మె కానేకాదు. అది చట్టవిరుద్ధమైన.. ప్రజలకు అసౌకర్యం కల్పించే చర్య మాత్రమే. ఈ విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. విధులకు హాజరైన ఉద్యోగులు, కార్మికుల సెప్టెంబర్ నెల జీతం వెంటనే విడుదల చేస్తాం.

ప్రతిపక్షాలు గోతికాడి నక్కలు

అర్థరహిత డిమాండ్లతో, చట్టవిరుద్ధంగా కార్మికులు చేస్తున్న సమ్మెకు రాష్ట్రంలో కొన్ని రాజకీయపక్షాలు మద్దతు ఇవ్వటం అనైతికం. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ, న్యాయసమ్మతం కాని కోర్కెలతో సమ్మెచేసేవారికి మద్దతిచ్చే రాజకీయపక్షాలకు ప్రజల మద్దతులేదు. అసలు రాష్ట్రంలో సరైన ప్రతిపక్షమే లేదు. రాష్ట్రంలో పరిస్థితి నాదాన్ దుష్మన్ అనేవిధంగా ఉన్నది. రాజకీయ ప్రయోజనం కోసం గోతికాడి నక్కల్లా ఎదురుచూస్తున్నాయి. వారి ఆశ ఫలించదు. సమ్మెకు మద్దతు ఇస్తున్న పార్టీలకు ప్రజల నుంచి ఛీత్కారం తప్పదు. గతంలో అనేక విషయాల్లో తప్పుడు వైఖరి అవలంబించడం వల్లే వారు ప్రజల మద్దతు కోల్పోయారు. ఆర్టీసీ విషయంలో కూడా అలాగే జరుగుతుంది. ఇక్కడ ఆర్టీసీ కార్మికులు కోరుతున్న డిమాండ్లలో వేటిని కూడా ఆయా రాజకీయపార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో అమలుచేయడం లేదు. ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారు.

కేంద్రం విధానాలకు విరుద్ధంగా స్థానిక బీజేపీ మాటలు

బీజేపీ నాయకులు ఇక్కడ బాగా మాట్లాడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఇండియన్ రైల్వేస్‌ను ప్రైవేటీకరిస్తున్నది. ఎయిర్‌లైన్స్‌ను ప్రైవేటీకరించింది. చివరికి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను కూడా ప్రైవేటీకరించింది. వివిధ ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకోవడం ద్వారా నిధులు సమకూర్చుకుంటామని కేంద్రం బడ్జెట్‌లోనే చెప్పింది. అక్కడ వారి ప్రభుత్వం ఇలా చేస్తుంటే, ఇక్కడి ఆ పార్టీ నాయకులు మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు.

19 వరకు దసరా సెలవులు

మూడు నాలుగురోజుల్లోనే వందకు వందశాతం ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. అప్పటివరకు విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల సెలవులను ఈ నెల 19 వరకు పొడిగిస్తున్నాం. సిలబస్ నష్టపోకుండా భవిష్యత్తులో రెండో శనివారం విద్యాసంస్థలు నడుపాలి. అవసరమైతే ఇతర సెలవులు తగ్గించుకోవాలి. 21 నుంచి అన్ని బస్సులు అందుబాటులోకి వస్తాయి. బస్‌పాస్ విషయంలో ఒక్క విద్యార్థి కూడా బాధపడొద్దు. బస్‌పాసులున్న విద్యార్థులు యథావిధిగా తమ విద్యాసంస్థలకు వెళ్లవచ్చు.

బస్టాండుల వద్ద భారీ బందోబస్తు

సమీక్ష సమావేశం నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ డీజీపీ మహేందర్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. ప్రతి ఆర్టీసీ డిపో, బస్టాండ్ల వద్ద పోలీసు బందోబస్తును పెంచండి. అన్నిచోట్ల సీసీ కెమెరాలు పెట్టండి. మహిళా పోలీసులను కూడా బందోబస్తు కోసం వినియోగించండి. నిఘా పోలీసులనూ ఉపయోగించండి. ప్రజలను ఇబ్బందులకు గురిచేసేవారిని, బస్సులను ఆపేవారిని, ఇతర చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడేవారిని గుర్తించి, కేసులు పెట్టి, కోర్టుకు పంపాలి. ఉద్యమంపేరిట విధ్వంసంచేస్తే ఉపేక్షించాల్సిన అవసరం లేదు. అని చెప్పారు. ఈ సమీక్షాసమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్, సీనియర్ అధికారులు సునీల్‌శర్మ, నర్సింగ్‌రావు, సందీప్ సుల్తానియా, రవాణాశాఖ జాయింట్ కమిషనర్లు పాండురంగనాయక్, సీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

అరాచకాలను సహించం

ఉద్యమాన్ని మరింత ఉధృతంచేస్తామని యూనియన్లుగా చెప్పుకునేవారు ప్రకటిస్తున్నారు. ఉధృతంచేసినా, పిల్లిమొగ్గలువేసినా ప్రభుత్వం చలించదు. బెదిరింపులకు భయపడదు. బస్సులు నడిపి, ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంది. బస్సులను ఆపి, బస్టాండ్లు, బస్‌డిపోల వద్ద అరాచకం చేద్దామని చూస్తే సహించేది లేదు. గూండాగిరీ నడువదు. ఇప్పటివరకు ప్రభుత్వం కాస్త ఉదాసీనంగా ఉన్నది. ఇకపై కఠినంగా వ్యవహరిస్తుంది. బస్‌స్టాండ్లు, బస్‌డిపోల వద్ద ఎవరు బస్సులను ఆపినా, విధ్వంసం సృష్టించినా కఠినచర్యలు తీసుకుంటుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button