రైతుబంధు స్కీమ్లో మార్పులు చేర్పులు చేసే దిశగా సర్కారు ఆలోచిస్తున్నది. పంట పెట్టుబడి సాయంగా ప్రతీ ఏటా రెండు సీజన్లకు కలిపి సుమారు రూ. 15 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం రైతుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని అవసరమైన సవరణలు చేయాలనుకుంటున్నది. విస్తీర్ణంతో సంబంధం లేకుండా పట్టాదారులైన రైతులందరికీ ఈ పథకాన్ని ప్రస్తుతం వర్తింపజేస్తున్నది. భూస్వాములకు కూడా సాయం చేయడంపై సామాన్య రైతుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సీలింగ్ విధించడంపై ఆలోచిస్తున్నది. గరిష్టంగా ఐదు ఎకరాల వరకు పరిమితం చేయాలా? లేక పది ఎకరాల వరకు కొనసాగించొచ్చా అనేదానిపై చర్చలు ప్రాథమిక స్థాయిలో ఉన్నాయి. డ్యామేజ్ కంట్రోల్ చర్యల్లో భాగంగా ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించింది.
ఆర్థిక కోణం నుంచి కాకుండా సామాన్య రైతుల్లో నెలకొన్న అభిప్రాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నట్లు అధికారుల సమాచారం. ఇప్పటికే రైతులకు ఉన్న సొంత భూమి విస్తీర్ణానికి అనుగుణంగా జిల్లాలవారీగా వ్యవసాయ, రెవెన్యూ శాఖల దగ్గర సమగ్రమైన సమాచారం ఉన్నది. రైతుల్లో ఉన్న వ్యతిరేకతపై క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సిబ్బంది మరింత లోతుగా ఇంటరాక్ట్ కావాలనుకుంటున్నది. వారి నుంచి వచ్చే అభిప్రాయాలకు అనుగుణంగా గరిష్ట సీలింగ్పైన ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 63 లక్షల మంది రైతులు (2021-22 యాసంగి లెక్కల ప్రకారం) రైతుబంధు లబ్ధిదారులుగా ఉన్నారు. వీరి చేతిలో ఉన్న సుమారు కోటిన్నర ఎకరాలకు పంట పెట్టుబడి సాయంగా ఈ స్కీమ్ అమలవుతున్నది.
ఐదెకరాలకుపైన ఉన్నవారు 5.74 లక్షల మంది
రాష్ట్రంలో ఐదెకరాలకంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల సంఖ్య సుమారు 5.74 లక్షల మందిగా ప్రభుత్వం గుర్తించింది. వీరి చేతుల్లో సుమారు 45.92 లక్షల ఎకరాలు ఉన్నట్లు తేలింది. రైతుబంధు స్కీమ్ కింద అందుకుంటున్న పంట సాయంలో సుమారు మూడింట ఒక వంతు వీరి చేతుల్లోనే ఉన్నది. ఏటా సుమారు రూ. 15 వేల కోట్లను ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఐదెకరాల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన ఐదున్నర లక్షల మంది లబ్ధిదారులకు దాదాపు రూ. 4,592 కోట్లు అందిస్తున్నది. ఐదెకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన లబ్ధిదారులు కేవలం 9.12% మాత్రమే ఉంటే వీరి చేతుల్లోని భూమి మాత్రం దాదాపు మూడవ వంతు. భూస్వాములకూ ప్రభుత్వం రైతుబంధు ఇస్తున్నది.. మాకూ ఇస్తున్నది.. వారికేమో లక్షల్లో అందుతుంటే మాకు పది వేల కంటే ఎక్కువ రావడంలేదు.. ఇవీ సామాన్య రైతుల నుంచి వినిపిస్తున్న మాటలు.
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా ఆ నియోజకవర్గంలో ఇలాంటి కామెంట్లు రైతుల నుంచి బహిరంగంగానే వినిపిస్తున్నాయి. దీనికి తోడు కేసీఆర్ సర్కారు ఇస్తున్నది సరేగానీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన జేబుల్లోంచి ఇవ్వడంలేదుగదా.. ప్రజల డబ్బునే ప్రభుత్వం ఇస్తున్నదంటూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకూ ఇలాంటి కామెంట్లు రైతుల నుంచి రాకపోయినా మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా వినిపించడాన్ని టీఆర్ఎస్ సీరియస్గా తీసుకున్నది. ఓట్లపై అది ఎలాంటి ప్రభావం చూపిస్తుందోననే గుబులు ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పేద రైతుల ఆలోచనల్లో మార్పు వచ్చేలా, వారి అసంతృప్తిని చల్లార్చేలా దిద్దుబాటు చర్యలు తీసుకోవడం అనివార్యమనే ఆలోచనకు వచ్చినట్లు సచివాలయ వర్గాల సమాచారం.
కొత్త కమతాలు రావడంతో కటాఫ్ డేట్పై చర్చ
రైతుబంధు స్కీమ్కు సీలింగ్ విధించడంపై ఇంకా ప్రభుత్వం స్పష్టమైన అభిప్రాయానికి, నిర్ణయానికి రాకపోయినా రైతుల్లో నెలకొన్న అంశాలను మాత్రం పరిగణనలోకి తీసుకున్నది. స్కీమ్ మొదలుపెట్టేనాటికి రాష్ట్రంలో ఉన్న భూ కమతాలు ఎన్ని.. కరోనా తర్వాతి పరిస్థితుల్లో కొత్తగా చేరిన లబ్ధిదారులెవ్వరు, ధరణి పోర్టల్ వినియోగంలోకి వచ్చిన తర్వాత పుట్టుకొచ్చిన కొత్త కమతాలు ఎన్ని, ఇలాంటి అన్ని అంశాలను జిల్లాలవారీగా క్రోడీకరించే ప్రక్రియ అధికారుల స్థాయిలో మొదలైంది. ఒకవేళ సీలింగ్ విధించాల్సి వస్తే గరిష్ట స్థాయిలో భూ విస్తీర్ణాన్ని ఎంత వరకు పరిమితం చేయొచ్చు, కొత్త కమతాలు పుట్టుకొచ్చినందున కటాఫ్ డేట్ను ఫిక్స్ చేసేదెలా.. తదితరాలన్నింటిపై అధికారులు కసరత్తు మొదలుపెట్టారు.
ఈ ఏడాది యాసంగి సీజన్ లెక్కల ప్రకారం ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాలను పరిశీలిస్తే ఐదు ఎకరాలకంటే ఎక్కువ భూమి ఉన్నవారి సంఖ్య 5.74 లక్షల మంది. మొత్తం లబ్ధిదారుల్లో వీరు 9.12%. పది ఎకరాలకంటే ఎక్కువ భూమి ఉన్నవారి సంఖ్య 92,792 మంది. వీరు కేవలం 1.48%. రైతుబంధు పథకాన్ని అమలుచేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నా, ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా ఉన్నదని ప్రకటించుకుంటున్నా సామాన్య రైతుల్లో మాత్రం అసంతృప్తి నెలకొనడం గమనార్హం. పది పైసల వంతు మందిగా ఉన్న భూస్వాములకు సుమారు 30 పైసల మేర రైతుబంధు డబ్బులు పడుతున్నాయన్న ఆవేదన వ్యక్తమవుతున్నది. వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నా వ్యతిరేకత రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్న ప్రభుత్వం సీలింగ్ విషయంలో చర్చించి ప్రతిపాదనలను సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
రైతుబంధు లబ్ధిదారుల వివరాలు (2021-22 యాసంగి సీజన్ గణాంకాల ప్రకారం లక్షల్లో)
2.47 ఎకరాల లోపు రైతులు : 45,73,052
2.49-4.94 ఎకరాల మధ్యలో : 11,53,120
4.95-9.88 ఎకరాల మద్యలో : 4,81,655
9.89-24.78 ఎకరాల మద్యలో : 86,846
24.78 ఎకరాలకు పైన ఉన్నోళ్ళు : 5,946