rythu bandhu updates today 2023
‘రైతుబంధు’కు నిధుల కటకట!
నాలుగైదు ఎకరాల్లోపు ఉన్న రైతులకే నగదు బదిలీ
అంతకుమించి భూమి ఉన్నవారికి ఎదురుచూపులు
నిధులు సర్దుబాటు చేయని ఆర్థిక శాఖ
ఈ సీజన్లో రూ.4,378 కోట్లు రైతులకు చెల్లింపు
ఇంకా చెల్లించాల్సింది రూ.3,342 కోట్లు
రాష్ట్రంలో పది రోజులుగా నిలిచిన నగదు బదిలీ
హైదరాబాద్ రాష్ట్రంలో రైతన్నలు వానకోసమేకాదు.. రైతుబంధు పైసల కోసమూ ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. తమ బ్యాంకు ఖాతాలో సొమ్ము పడి తమ ఫోన్ ఎప్పుడు టింగ్.. టింగ్మని మోగుతుందా అని వేచి చూస్తున్నారు. వర్షాలులేక రైతులు ఇప్పటికే ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో రైతుబంధు చేతికి అందితే కాస్త ఊరట లభిస్తుందన్న ఆశతో వారున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొంత మంది రైతులకు రైతు బంధు సొమ్మును వారి ఖాతాల్లో జమ చేసింది. నాలుగైదు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు నగదు బదిలీ చేసింది. అంతకు మించి భూమి ఉన్న వారు తమకు ఎప్పుడు రైతు బంధు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ పథకానికి నిధుల కొరత ఏర్పడింది. ఆర్థిక శాఖ నుంచి నిధులు సర్దుబాటు చేయకపోవటంతో ట్రెజరీలో బిల్లులు పెండింగ్లో పడిపోయాయి. నిధుల కటకట మూలంగా నగదు బదిలీ నిలిచిపోయింది. ఖరీఫ్ సీజన్కు సంబంధించిన రైతుబంధు నగదు బదిలీని గత జూన్ 26 నుంచి రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. తొలిరోజు 22,55,081 మంది రైతులకు రూ.642.52 కోట్లు బదిలీ చేశారు. రెండో రోజు 16,98,957 మంది రైతులకు రూ.1278.60 కోట్లు చెల్లించారు. మూడో రోజు 10.89 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,325.24 కోట్లు, నాలుగో రోజు 6,64,717 మంది రైతుల ఖాతాల్లో రూ.1,131 కోట్లు జమచేశారు. ఈ సీజన్లో రూ.7,720 కోట్లు రైతులకు పంపిణీ చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు. రూ.4,378 కోట్లు రైతులకు చెల్లించారు. ఇంకా రూ.3,342 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. అయితే ఈ నిధులను కేసీఆర్ ప్రభుత్వం సర్దుబాటు చేయలేకపోతోంది. ఫలితంగా పది రోజులుగా నగదు బదిలీ నిలిచిపోయింది.
వ్యవసాయ కమిషనరేట్ నుంచి పంపించిన బిల్లులన్నీ ట్రెజరీలో పెండింగ్లో ఉన్నాయి. ఆర్థికశాఖ నుంచి నిధులు సర్దుబాటు చేస్తేనే బిల్లులు పాస్ చేసే అవకాశం ఉంటుంది. నిధుల కటకటతో ట్రెజరీ వద్దే ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో బిల్లులు ఎప్పుడు పాసవుతాయో అని వ్యవసాయశాఖ అధికారులు, ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు జమచేస్తారోనని రైతులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే కొందరు రైతులు విత్తనాలు వేయగా మరికొందరు వర్షాలు వస్తేనే నాటుతామని దుక్కులు దున్ని వేచిచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో రైతుబంఽధు డబ్బులు వస్తే కాస్త ఆసరాగా ఉంటుందని రైతులు అంటున్నారు. మరోవైపు ఉద్యోగులకు వేతనాలు చెల్లించటానికి కూడా నిధులు సర్దుబాటు చేయాల్సి వస్తోంది. గతంలో ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించే సంస్కృతి ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. రోజుకో జిల్లా చొప్పున వంతుల వారీగా వేతనాలు చెల్లిస్తున్నారు. ఇదే సమయంలో రైతుబంధు నగదు బదిలీ కూడా చేయాల్సి రావటంతో రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు సమకూర్చడం ఇబ్బందికరంగా మారింది.