Teachers Recrutment Updates 2024
టెట్’ పాసైతేనే పదోన్నతులకు అర్హులని ఎన్సీటీఈ(నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్) కొత్త నిబంధనలు విధించడంతో ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెన్షన్ పట్టుకుంది.
‘టెట్’ పాసైతేనే పదోన్నతులకు అర్హులని ఎన్సీటీఈ(నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్) కొత్త నిబంధనలు విధించడంతో ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెన్షన్ పట్టుకుంది. ఎప్పుడో ఉద్యోగాలు పొందిన తాము ప్రభుత్వం పదోన్నతులు పొందేందుకు ‘టెట్’ తప్పనిసరి పాస్ కావాలని నిబంధన పెట్టడం ఏమి టని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. టెట్ అర్హత సాధించడం ఇప్పుడు సాధ్యమయ్యే పని కాదని తమ కోసం ప్రత్యేక టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. కాగా రాష్ట్ర విద్యాశాఖ మాత్రం డీఎడ్, బీఎడ్ అభ్యర్థులతో పాటే ప్రస్తుత ఉపాధ్యాయులు కూడా టెట్ రాయాల్సిందేనని అంటోంది. ఏప్రిల్లో టెట్ నిర్వహించిన తర్వాతే ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు ఉంటాయని పేర్కొంటోంది. ప్రభుత్వ నిర్ణయంతో ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
‘టెట్’ నిర్వహణ ఇలా..
టెట్ తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. పూర్తి పేపర్ 150మార్కులకు ఉంటుంది. ఇందులో అర్హత సాధించాలంటే ఓసీలు 60శాతం, బీసీలు 50శాతం, ఎస్సీ, ఎస్టీలు 40శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. పేపర్-1 ఉత్తీర్ణత కావాలంటే చైల్డ్ డెవలప్మెంట్, తెలుగు, ఇంగ్లీష్, గణితం, పర్యావరణానికి సంబంధించిన అంశాలు ఉంటాయి. పేపర్-2లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఈ అంశాలన్ని చదవడం ఇబ్బందికరమని ఉపాధ్యాయులు అంటున్నారు. ఎప్పుడో ఉద్యోగాలు పొందినవారు ఇప్పుడు టెట్ ఉత్తీర్ణత ఉండాలని చెబుతుండటంతో ఉపాధ్యాయులు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థి తుల్లో అవన్నీ తాము చదవలేమని తమకు ప్రత్యేక టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
2009లోనే ఉత్తర్వులు..
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే అంటే 2009లోనే ప్రభుత్వం టెట్ ఉత్తర్వులు జారీ చేసింది. 2010లో కొత్తగా డీఎస్సీ రాయాలనుకునే వారికి టెట్ నిర్వహించింది. కానీ ఇన్సర్వీసులో ఉన్నవారు కూడా టెట్ రాయాలని చెప్ప లేదు. 2013లోను, 2015లోనూ ఉపాధ్యాయులకు పదోన్న తులు చేపట్టింది. ఈ పదోన్నతుల్లో వారికి టెట్ మినహా యించింది. అంతెందుకు ఇటీవల జరిగిన మల్టీజోన్ స్థాయి బదిలీల్లో కూడా టెట్కు ప్రాధాన్యత కల్పించలేదు. మల్టీజోన్-1లో జరిగిన బదిలీలు పొందిన వారికి టెట్ అడగలేదు. ఇతర కారణాల చేత మల్టీజోన్-2లో బదిలీలు నిలిచిపోయాయి. ప్రస్తుతం మల్టీజోన్-2లో బదిలీలు పొందే వారు కూడా టెట్ రాయాలని అనడంతో ఇబ్బందులు తలె త్తుతున్నాయి. జిల్లాలో దాదాపు అన్ని యాజమాన్యాలలో కలిపి రెండువేలకు పైగా టీచర్లు ఉంటే దాదాపు 2000ల మంది టెట్ అర్హత లేని వారే.
హేతుబద్దత ఏది?
అసలు టెట్ నిర్వహణకు హేతుబద్దత లేదని ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. ఉపాధ్యాయ ఉద్యోగానికి డీఎస్సీ రాస్తే సరిపోతుందని డీఎస్సీకి అర్హులైతే చాలని ఉద్యోగ అర్హతకు డీఎస్సీకి మధ్య ఈ టెట్ హేతురహితమని అంటున్నారు. ఎక్కడా లేని విధంగా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రకరకాల మార్కులను నిర్ణయిం చడం సరికాదని చెబుతున్నారు. కాగా పీఎస్ హెచ్ఎంలు ప్రైమరీ స్కూల్లో బోధిస్తారని, విధులు మాత్రం ఎస్జీటీ స్థాయిలో ఉంటాయని అటువంటి వారు లెవల్-1 పరీక్ష రాయాలా?, లెవల్-2 పరీక్ష రాయాలా అనే దానిపై ఇంత వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదని అంటున్నారు. పండిట్ టీచర్లు పేపర్-1 కానీ, పేపర్-2కానీ రాయలేరని అన్నారు. ఎందుకంటే వారికి సంబంధించిన సిలబస్ ఆ పేపర్ల్లలో ఉండదని వారికి ప్రత్యేకమైన ప్రశ్నా పత్రం ఉండాలని అలాంటి వారు పదోన్నతులు పొందా లంటే ఎలా అనేదానికి విద్యాశాఖ స్పష్టత ఇవ్వలేదని విమర్శిస్తున్నారు.
‘టెట్’ నుంచి మినహాయింపు ఇవ్వాలి..
– రవికుమార్, టీఎస్యూటిఫ్ జిల్లా ఆడిట్ కన్వీనర్
ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. ప్రస్తుతం టెట్కు సమాయత్తమవుతున్న వారితో పోటీపడి పరీక్ష రాసే పరిస్థితులు కల్పించొద్దు. టెట్ నిర్వ హణ హేతరహితంగా ఉంది. పీఎస్ హెచ్ఎంలు, పీజీ హెచ్ఎంలు, పండిట్లు ఏ పరీక్ష రాయాలనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. తప్పనిసరి పరిస్థితుల్లో నిబంధన అమలు చేస్తే 2010కి ముందు నియామకమైన ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించాలి.