Farmars Updates In TS || Rythu Bandhu 2023
పండుగలా వ్యవసాయం
పండుగలా వ్యవసాయం
వ్యవసాయం దండగ అన్నవాళ్ల నోళ్లను మూయిస్తూ సీఎం కేసీఆర్ సాగు రంగాన్ని పండుగలా మార్చారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. రైతు బంధు, రైతు బీమా, యంత్రలక్ష్మి, రైతు వేదికలు, రైతు బంధు సమితులను ఏర్పాటు చేశారు.
- ఇతర రాష్ట్రాల నుంచి కూలీల వలసబాట
- కామారెడ్డి జిల్లాలో రెండేండ్లలో గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణం
- ‘సాక్ష్యా’లు లేకుండా ఆంధ్రపత్రిక విషప్రచారం
- రైతులు గల్ఫ్బాట పడుతున్నారంటూ రాతలు
- తప్పుడు కథనంపై అన్నదాతల కన్నెర్ర
వ్యవసాయం దండగ అన్నవాళ్ల నోళ్లను మూయిస్తూ సీఎం కేసీఆర్ సాగు రంగాన్ని పండుగలా మార్చారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. రైతు బంధు, రైతు బీమా, యంత్రలక్ష్మి, రైతు వేదికలు, రైతు బంధు సమితులను ఏర్పాటు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడంతో పాటు మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వవైభవం తీసుకొచ్చింది. ఎక్కడికక్కడ చెక్డ్యాముల నిర్మాణంతో వృథా నీటికి చెక్ పడింది. సాగు పెట్టుబడి మొదలు పంట కొనుగోలు చేసే వరకు ప్రభుత్వమే అండగా నిలుస్తున్నది. దీంతో కామారెడ్డి జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. బతుకు దెరువు కోసం ఎడారి దేశాలకు వెళ్లిన వారు సైతం ఇండ్ల బాట పట్టారు. ఇతర రాష్ర్టాల నుంచి సైతం కూలీలు వలస వస్తున్నారు. కానీ వాస్తవాలకు దూరంగా ఓ ఆంధ్ర పత్రిక రైతులు గల్ఫ్బాట పడుతున్నారని కథనం ప్రచురించడంపై కర్షకులే ముక్కున వేలేసుకుంటున్నారు. కండ్ల ముందే వ్యవసాయ రంగం సాధించిన ప్రగతి కనిపిస్తున్నా.. తప్పుడు కథనం ప్రచురించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సమైక్య రాష్ట్రంలో వ్యవసాయం దండుగ అన్న పాలకులకు.. స్వరాష్ట్రం సిద్ధించాక వ్యవసాయం పండుగ అనేలా చేశారు సీఎం కేసీఆర్. రైతు బంధు, రైతు బీమా, యంత్రలక్ష్మి, రైతు వేదికలు, రైతు బంధు సమితిల ఏర్పాటు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మిషన్ కాకతీయ, రిజర్వాయర్లు, కాలువలు, చెక్డ్యాముల నిర్మాణం, రైతులు పండించిన పంటను మద్దతు ధరతో కొనుగోలు చేయడం.. ఇలా అనేక పనులతో నేడు రైతన్న గ్రామాల్లోనే దర్జాగా బతుకుతూ ఇతరులకు ఉపాధి కల్పిస్తున్నాడు. కామారెడ్డి జిల్లాలో 2018లో 2,43,760 మంది రైతులు ఉండగా.. 2022లో 2,92,240కు చేరారు. అంటే 48,480 మంది రైతులు పెరిగారు. సాగు విస్తీర్ణం కూడా 2020లో 3,61,468 ఎకరాలు ఉండగా.. 2023లో 4,14,120 ఎకరాలకు చేరుకున్నది. అంటే రెండేండ్లలోనే జిల్లాలో 52,652 ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగింది. ఇవేమీ పట్టని సమైక్యాంధ్ర పత్రిక, ఎలాంటి ‘సాక్ష్యా’లు లేకుండా రైతులు గల్ఫ్ బాట పడుతున్నారని విషప్రచారం చేయడం శోచనీయం. వాస్తవాలకు దూరంగా, ఎలాంటి ఆధారాలు లేకుండా కథనాలను ప్రచురిస్తూ రైతుల ఛీత్కారాలకు గురవుతున్నది ఆ పత్రిక. కామారెడ్డి జిల్లాలో వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతిపై ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న కథనం ఇది.
సాగునీటి రంగంలో..
రైతులు వ్యవసాయం చేయాలంటే సాగు నీరు అవసరం. రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ సాగునీటి రంగానికి వేల కోట్లు ఖర్చు చేసి కోటి ఎకరాలకు నీరందించేలా పనులు పూర్తి చేయించారు. జిల్లాలో మెట్ట ప్రాంతామైన కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గంలోని గట్టుమీది గ్రామాలకు కాళేశ్వరం ప్యాకేజీ 22ద్వారా నీరందించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున పనులను ప్రారంభించింది.
సాగునీటి రంగానికి కేటాయించిన నిధులివిగో..
కాళేశ్వరం ప్యాకేజి నంబర్-22 కింద కామారెడ్డి జిల్లాలో 1,84,554, నిజామాబాద్ జిల్లాలో 3,300, మెదక్ జిల్లాలో 12,146 ఎకరాలు, మొత్తం రెండు లక్షల ఎకరాలకు నీరందించేలా రూ.1446.48 కోట్లు మంజూరు చేశారు. వీటిలో ఇప్పటి వరకు రూ.367.06 కోట్లు ఖర్చు చేయగా.. పనులు పురోగతిలో ఉన్నాయి. భూసేకరణ కొనసాగుతున్నది. ఇటీవల నీటిపారుదల శాఖ సలహాదారు విజయభాస్కర్ ఆధ్వర్యంలోని నిపుణుల బృందం ప్యాకేజి-22కి సంబంధించిన పనుల పురోగతిని పరిశీలించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మసాగర్ నుంచి ఇప్పటికే నిజాంసాగర్ ప్రాజెక్టులోకి నీళ్లు వస్తున్నాయి.
నిజాంసాగర్ ప్రాజెక్టు దిగువన మల్లూరు వద్ద మంజీర నదిపై ఎత్తిపోతల పథకం కోసం రూ.476.25కోట్లు మంజూరు చేయగా.. అగ్రిమెంట్ పూర్తయ్యింది. దీని ద్వారా నిజాంసాగర్, పిట్లం, పెద్ద కొడప్గల్, బిచ్కుంద మండలాల్లోని సుమారు 30,646 ఎకరాలకు సాగు నీరు అందతుంది.
దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడికను మిషన్ కాకతీయ ద్వారా తొలగించి వర్షపు నీరు నిల్వ ఉండేలా జిల్లాలోని 1094 చెరువులను రూ.389కోట్లతో అభివృద్ధి చేశారు.
నదులు, వాగుల్లో నీరు నిల్వ ఉంచుతూ.. భూగర్భ జలాలను పెంచేందుకు జిల్లాలోని 41 ప్రాంతాల్లో రూ.171.883 కోట్లతో చెక్డ్యాములను నిర్మిస్తున్నారు. బాన్సువాడ డివిజన్లో రెండు చెక్ డ్యాములకు రూ.44.28కోట్లు, నిజాంసాగర్ డివిజన్లో 12 చెక్ డ్యాములకు రూ.65.35 కోట్లు, కామారెడ్డి డివిజన్లో ఐదు చెక్డ్యాములకు రూ.7.40కోట్లు, ఎల్లారెడ్డి డివిజన్లో 22 చెక్డ్యాములకు రూ.54.853 కోట్లు కేటాయించి పనులు చేయిస్తున్నారు. ఈ పనులన్నీ పూర్తయితే పొలాలకు పుష్కలంగా సాగునీరు అందుతుంది.
సాగునీటి రంగాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం ఇన్ని రకాల చర్యలు చేపడుతుండగా.. ఆంధ్ర పత్రికకు ఇంకా ఎన్ని ’సాక్ష్యా’లు కావాలని రైతులు ప్రశ్నిస్తున్నారు.
పెరిగిన రైతుల సంఖ్య.. వ్యవసాయ విస్తీర్ణం..
ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలతో కామారెడ్డి జిల్లాలో సాగు విస్తీర్ణం పెరగడంతోపాటు రైతుల సంఖ్య కూడా పెరుగుతున్నది. వ్యవసాయ రంగంలో తీసుకువస్తున్న మార్పులతో నేడు రైతులు సొంతుళ్లలోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ర్టాల నుంచి పలువురు ఇక్కడికి తరలి వచ్చి వ్యవసాయ కూలీ పనులు పని చేస్తున్నారు. అయితే ఇవేమీ పట్టని ఆంధ్రపత్రిక ‘సాక్ష్యా’లు లేకుండా గల్ఫ్ బాట పట్టారంటూ విషప్రచారం చేస్తున్నది.
వ్యవసాయ లెక్కలివిగో..
రైతులు గల్ఫ్ బాట పడితే సాగు విస్తీర్ణం తగ్గాలి కానీ ఎలా పెరుగుతుందో ఆ పత్రికకే తెలియాలి. రైతుబంధు ప్రవేశపెట్టిన 2018లో జిల్లాలో వానకాలంలో 2,07,385 మంది రైతులు రూ.177.38 కోట్ల ఆర్థిక సహాయాన్ని పొందారు. 2019 వానకాలంలో రైతుల సంఖ్య 17, 532 పెరిగి 2,24,917 మందికి లబ్ధి చేకూరింది. 2020 వానకాలంలో 24,591 మంది రైతులు పెరుగగా, మొత్తం రైతుల సంఖ్య 2,49,508కు చేరింది. 2021 వానకాలంలో 13,337 మంది పెరిగి రైతుల సంఖ్య 2,62,845కు చేరింది. 2022 వానకాలంలో రైతుల సంఖ్య 19,508కు పెరిగి 2,82,353కు చేరుకోగా.. అందరికీ రైతుబంధు ద్వారా లబ్ధి చేకూరింది. 2018లో రైతుబంధు ద్వారా రూ.177 కోట్లు పంపిణీ చేయగా, 2022లో రూ.254 కోట్లు అందజేశారు. నాలుగేండ్ల వ్యవధిలో రూ.77 కోట్లుఅదనంగా పంపిణీ చేశారు.
2021 వానకాలంలో 98,575 మంది రైతులకు రూ890.38 కోట్ల పంట రుణాలు ఇవ్వగా.. 2022 వానకాలంలో 1,02,579 మంది రైతులకు రూ.795 కోట్ల రుణాలు అందజేశారు.
రైతు బీమా గ్రూప్ లైఫ్ ఇన్సురెన్సును 2018లో 1,31,759 మందికి కల్పించగా, 2019లో 1,57,141 మందికి, 2020లో 1,68,700 మందికి, 2021లో 1,86,417 మందికి, 2022లో అత్యధికంగా 1,99,044 మందికి కల్పించారు. అంటే 2018 నుంచి 2022 వరకు గ్రూప్ ఇన్సురెన్స్ కోసం రైతుల సంఖ్య 67,285కు పెరగడం గమనార్హం.
తగ్గుతున్న గల్ఫ్ ఏజెంట్ల సంఖ్య..
ఒకప్పుడు కామారెడ్డి జిల్లాలో గల్ఫ్ ఏజెంట్లు వందల సంఖ్యలో ఉండగా.. నేడు పదుల్లో ఉన్నారు. గల్ఫ్కు వెళ్లే వారి సంఖ్య క్రమంగా తగ్గుతుండడంతో ఏజెంట్లు వేరే పనులు చేసుకుంటున్నారు. రైతులు గల్ఫ్కు అస్సలు వెళ్లడం లేదని, అడ్డాకూలీలు, మెకానిక్ పనులు చేసుకొనే వారు, కొందరు నిరుద్యోగులు మాత్రమే గల్ఫ్ వెళ్లడానికి ఆసక్తిని చూపుతున్నారని కామారెడ్డి పట్టణంలోని కిష్టయ్య చౌరస్తా వద్ద ఉన్న ఓ గల్ఫ్ ఏజెంట్ ‘నమస్తే తెలంగాణ’తో పేర్కొన్నారు. తాము ఆఫీసు పెట్టుకుంటే కనీసం కిరాయి పూర్తి డబ్బులు కూడా రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా మహమ్మారి కారణంగా గల్ఫ్ నుంచి వచ్చిన వారే ప్రస్తుతం తిరిగి ఆయా దేశాలకు వెళ్తున్నారని స్పష్టం చేశారు.
భూమి తక్కువగా ఉంది.. అందుకే గల్ఫ్కు వెళ్తున్నా..
నాకు మా గ్రామంలో కేవలం అద్దబిగెడు భూమి ఉంది. ఆ భూమిలో వానకాలంలోనే పంటను పండిస్తున్నాను. రెండెకరాల భూమి ఉంటే నేడు దర్జాగా ఇక్కడే వ్యవసాయం చేసుకొని బతికేవాణ్ణి. కానీ భూమి తక్కువ ఉండడంతో గల్ఫ్ కు వెళ్లాలని నిర్ణయించుకున్న. అక్కడ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తా. ప్రభు త్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో బాగున్నాయి. వాటితో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయం చేసుకోవచ్చు.
– రాజు, రాజంపేట
పంటల సాగు విస్తీర్ణం పెరుగుతోంది..
జిల్లాలో సాగు విస్తీర్ణం ప్రతి ఏడాదీ పెరుగుతున్నది. ప్రభుత్వం రైతు బంధు సాయం అందించడం, పంట రుణాలు ఇప్పించడం, సబ్సిడీ విత్తనాలు, జీలుగ, ఎరువులు ఇవ్వడంతోపాటు ఏఈవోలతో సలహాలు, సూచనలు, రైతు వేదికల ద్వారా సమావేశాలు నిర్వహించడంతో వ్యవసాయంపై ఆసక్తిని చూపుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించడంతోపాటు జొన్న, మక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడానికి నిదర్శనమే రైతుబంధు, రైతు బీమాలో పెరుగుతున్న రైతుల సంఖ్య.
– వీరస్వామి, జిల్లా వ్యవసాయాధికారి
సమయానికి రైతుబంధు అందుతున్నది..
మాచారెడ్డి, మే 22: సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఇస్తున్న రైతుబంధు సకాలంలో వస్తున్న ది. పంట పెట్టుబడి కోసం ఇతరుల వద్దకు వెళ్లి అప్పు చేసే పని లేకుండా పోయింది. ఊర్లనే ఉం టూ పొలంపని చేసుకుంటున్నం.
– లక్ష్మీనర్సింహులు, రత్నగిరిపల్లి
పెట్టుబడికి ఢోకా లేదు..
మాచారెడ్డి, మే 22: పెట్టుబడి కోసం ఇంకొకరి దగ్గర చేతులు చా చకుండా సీఎం కేసీఆర్ సమయానికి డబ్బులు ఇవ్వడంతో మాకు ఎంతో మేలు జరుగుతున్నది. రైతు బంధు ద్వారా రైతులకు పెట్టుబడికి ఢోకాలేకుండా పోయింది.