Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News
RAJIV YUVA VIKASAM LATEST UPDATE 2025
రాజీవ్ యువ వికాసం - తొలి విడతలో రూ.లక్షలోపు రుణాల మంజూరు

రాజీవ్ యువవికాసానికి దరఖాస్తు చేసుకున్న 16.23 లక్షల మంది – జూన్ 2న 5లక్షల మందికి మంజూరు పత్రాల జారీలో భాగంగా కేటగిరి 1,2 యూనిట్లు కేటాయింపు
రాజీవ్ యువ వికాసం పథకం కింద తొలి విడతలో భాగంగా రూ.లక్షలోపు రుణాలు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2వ తేదీన అర్హులైన 5 లక్షల మందికి మంజూరు పత్రాల జారీలో భాగంగా కేటగిరీ-1, 2 యూనిట్లను కేటాయించనుంది. వీటిలో అర్హులైన 1.32 లక్షల మంది లబ్ధిదారులకు పథకాన్ని వెంటనే అమలు చేసేందుకు రూ.1,100 కోట్ల డబ్బు అవసరమని లెక్కకట్టింది. ఈ రెండు కేటగిరీలకు సంబంధించిన లబ్ధిదారులకు తొలి విడతలో ప్రాధాన్యమివ్వాలని, మిగతా కేటగిరీలకు 2, 3 విడతల్లో స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేయాలని భావిస్తోంది. ఈ పథకం కింద కేటగిరీల వారీగా వచ్చిన దరఖాస్తుల సంఖ్య ఆధారంగా యూనిట్లు మంజూరు చేసేందుకు వివిధ సంక్షేమ శాఖలు కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి.

రాజీవ్ యువ వికాసం పథకానికి 16.23 లక్షల మంది నిరుద్యోగ యువకులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెలాఖరుకు జిల్లా మంత్రుల అనుమతితో కలెక్టర్లు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నారు. యువవికాసం పథకం కోసం నెలకు రూ.2,000 కోట్ల చొప్పున 3 దఫాలుగా రూ.6,000 కోట్లు ఖర్చు చేయాలని సర్కారు నిర్ణయించింది. కేటగిరీ-1 యూనిట్లు మినహా మిగతా కేటగిరీ-2, 3, 4 యూనిట్లకు బ్యాంకు లింకేజీ మస్ట్. కేటగిరీ-1, 2 లోన్లకు దరఖాస్తులు తక్కువగా వచ్చాయి. ఈ రెండింటి కింద ప్రభుత్వం 2.8 లక్షల మంది అర్హులైన వారికి లబ్ధి చేకూర్చాలని అంచనా వేసింది. ఇందుకోసం తొలివిడతలో రూ.2 వేల కోట్లు అవసరమని లెక్కించింది. కేటగిరీ-1 కింద రూ.50 వేల లోపు రుణాలను 100 శాతం గ్రాంటుగా ఇస్తోంది. కేటగిరీ-1లో 1.58 లక్షల మందికి ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ దరఖాస్తులు 39,401 మాత్రమే వచ్చాయి. కేటగిరీ-2లో రూ.50 వేలు- రూ.లక్షలోపు 1.22 లక్షల మందికి ఇవ్వాలని అంచనా వేయగా కేవలం 93,233 మంది మాత్రమే దరఖాస్తు చేశారు. ఇటీవల జరిగిన సమీక్షలో ఈ 2 కేటగిరీల్లో అర్హులైన లబ్ధిదారులందరికీ వెంటనే రుణాలివ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.