14 thousand Anganwadi vacancies will be filled soon
త్వరలో 14 వేల అంగన్వాడీ ఖాళీల భర్తీ
ఆరోగ్యవంతమైన, విజ్ఞానవంతమైన సమాజం ఏర్పడినప్పుడు సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) అన్నారు. ములుగులో బీఈడీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. ములుగులోని డిగ్రీ కళాశాల సమీపంలో రూ.కోటి 34 లక్షల వ్యయంతో నిర్మించనున్న బాలసదనం భవనానికి సోమవారం ఆమె శంకుస్థాపన చేశారు.
ప్రభుత్వ ఏరియా వైద్యశాల బాలింతల విభాగంలో తల్లిపాల విభాగాన్ని ప్రారంభించారు. ఇదే ఆవరణలో జరిగిన కార్యక్రమంలో దివ్యాంగులు, అంగన్వాడీలకు ఉపకరణాలను పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14 వేల అంగన్వాడీ ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. తొలి ప్రాధాన్యంగా 4 వేల మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేసి టీచర్ల జీతాన్ని రూ.7,500 నుంచి రూ.13 వేలకు పెంచినట్టు తెలిపారు.
కేజీబీవీ, గురుకుల ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. రామప్ప దేవాలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్న సీతక్క రుద్రేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రసాద్ పథకంలో భాగంగా సైట్-ఏలోని పదెకరాల్లో రూ.61.99 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులు, నిర్మాణాలను పరిశీలించి అసంతృప్తి వ్యక్తంచేశారు. జూన్లోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.