PM Kisan Scheme || PM-Kisan Samman Nidhi
భార్యాభర్తలు పీఎం కిసాన్ డబ్బులు తీసుకోవచ్చా? రూల్స్ ఇవే
PM Kisan Scheme | భార్యాభర్తలు పీఎం కిసాన్ డబ్బులు తీసుకోవచ్చా అనే డౌట్ రైతుల్లో ఉంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం (PM Kisan Scheme) ద్వారా రైతులకు ప్రతీ ఏటా రూ.6,000 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతీ ఏటా మూడు విడతల్లో రూ.2,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటివరకు 13వ ఇన్స్టాల్మెంట్స్ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. త్వరలో పీఎం కిసాన్ 14వ ఇన్స్టాల్మెంట్ (PM Kisan 14th Installment) విడుదల కావాల్సి ఉంది. సుమారు 8 కోట్లకు పైగా రైతులు పీఎం కిసాన్ 14వ ఇన్స్టాల్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న పలు రకాల ప్రచారాలతో రైతుల్లో కొత్త సందేహాలు తలెత్తుతున్నాయి. భార్యాభర్తలు ఇద్దరూ పీఎం కిసాన్ డబ్బులు తీసుకోవచ్చా అనే సందేహాలు వస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై గతంలోనే క్లారిటీ ఇచ్చింది. 2019లో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ప్రారంభించినప్పుడే ఈ పథకానికి సంబంధించిన అర్హతలకు సంబంధించి కొన్ని నియమనిబంధనలు రూపొందించింది. ఆ నిబంధనల ప్రకారం పీఎం కిసాన్ పథకం ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తిస్తుంది.
ఉదాహరణకు భార్యాభర్తలిద్దరికీ పొలం ఉన్నట్టు వేర్వేరుగా పట్టాలు ఉన్నా వీరిలో ఒకరికి మాత్రమే పీఎం కిసాన్ పథకం వర్తిస్తుంది. ఒకవేళ ఇద్దరు దరఖాస్తు చేసుకున్నా ఒకరి అప్లికేషన్ మాత్రమే సక్సెస్ అవుతుంది. మరొకరి దరఖాస్తు రిజెక్ట్ అవుతుంది. అయితే గతంలో భార్యాభర్తలిద్దరి అప్లికేషన్స్ సక్సెస్ అయినట్టు వార్తలొచ్చాయి. ఒకవేళ భార్యాభర్తలిద్దరికీ పీఎం కిసాన్ డబ్బులు జమ అయినట్టైతే వారిలో ఒకరు పీఎం కిసాన్ డబ్బుల్ని వెనక్కి ఇచ్చెయ్యాలి.
ఇక పీఎం కిసాన్ స్కీమ్ రైతులందరికీ వర్తించదు. చిన్న, సన్నకారు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పథకం ఇది. ఏ రైతులు ఈ పథకానికి అర్హులో గతంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్ హోల్డర్స్, రాజ్యాంగ పదవులు కలిగి ఉన్నవారు, మాజీ మంత్రులు, ప్రస్తుత మంత్రులు, రాష్ట్ర మంత్రులు, మాజీ లోక్సభ సభ్యులు, ప్రస్తుత లోక్సభ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు, రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ సభ్యులు, మునిసిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్లు, ప్రస్తుత మేయర్లు, జిల్లా పంచాయతీ ప్రస్తుత ఛైర్పర్సన్స్, మాజీ ఛైర్పర్సన్స్కు పీఎం కిసాన్ స్కీమ్ వర్తించదు.
వీరితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, కార్యాలయాలు, విభాగాల్లో సేవలు అందిస్తున్న ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయంప్రతిపత్తి గల సంస్థల ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు, అధికారులు, స్థానిక సంస్థల్లో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులు, ప్రొఫెషనల్ బాడీస్లో రిజిస్టర్ అయి ఉన్న డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్ లాంటి ప్రొఫెషనల్స్ పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేయకూడదు.