TS TET Marks 2022 | TS TET Updates Today
టెట్ ఫలితాల్లో గందరగోళం.. ఆందోళనలో అభ్యర్థులు.. కారణం ఏంటంటే..
తెలంగాణ టెట్(Telangana Tet) 2022 ఫలితాలు తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. తెలంగాణలోని 33 జిల్లాల నుంచి టెట్ పేపర్(TET Paper) 1 కు 3,18,444 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 1,04,078 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అంటే 32.68 శాతం మంది టెట్ పేపర్ 1లో క్వాలిఫై అయ్యారు. టెట్ పేపర్ 2(TET Paper 2) విషయానికి వస్తే.. మొత్తం 2,50,897 మంది దరఖాస్తు(Application) చేసుకోగా అందులో 1,24,535 మంది అర్హత సాధించారు. అంటే 49.64 శాతం మంది ఉపాధ్యాయ పోస్టులకు అర్హత పొందారు. పేపర్ 1 క్వాలిఫై అయిన వారు ఎస్జీటీ(SGT) పోస్టులకు.. పేపర్ 2 క్వాలిఫై అయిన అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్(School Assistant) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరోవైపు టెట్ పరీక్షలో చాలా తక్కువ శాతం అర్హత సాధించడంతో.. అర్హత సాధించని వారికి మరో అవకాశం కల్పించాలంటూ అభ్యర్థనలు వస్తున్నాయి. పేపర్ -1కు చాలా తక్కువ మంది క్వాలిఫై కావడం, అంతే కాకుండా ఆరునెలలకు ఒకసారి వెలువడాల్సిన టెట్ నోటిఫికేషన్ ఐదేళ్లకు వెలువడటంతో తాము ఎంతో నష్టపోయామని వాపోతున్నారు. దీంతో మరోసారి టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ అభ్యర్థులు కోరుతున్నారు. అయితే.. ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది.. ఎలాంటి స్పష్టత ఇస్తుందో చూడాల్సి ఉంది.