Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

TSPSC Latest News

TSPSC: ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను టీఎస్‌పీఎస్సీ ఎలా భ‌ర్తీ చేస్తుందంటే..?

 

 

 

ప్రభుత్వ ఉద్యోగం ప్రతీ నిరుద్యోగి కల.. ప్రస్తుతం ప్రభుత్వ విభాగాల్లో కొలువులు తగ్గుతుండగా, నిరుద్యోగుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించడంతో వారిలో ఆశలు చిగురించాయి.

 

 

త్వ‌ర‌లోనే భారీగా ప్ర‌భుత్వ కొలువులు భర్తీకి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ గురించి మీ కోసం స‌మ‌గ్ర స‌మాచారం..

దేశంలో నూతనంగా ఏర్పడి, నియామకాల్లో సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకున్న‌ది తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌. ఇది ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సెక్షన్ 83 (2) కింద తెలంగాణ ఏర్పడిన రోజైన 2014 జూన్ 2 నుంచి అమల్లో కొచ్చింది. దీనికి మొట్ట‌మొద‌టి చైర్మన్‌గా ప్రముఖ విద్యావేత్త, సీనియర్ జర్నలిస్టు, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ డీన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ప‌నిచేశారు. ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా బి.జనార్ధన్‌రెడ్డి, సభ్యులుగా రమావత్‌ ధన్‌సింగ్, బండి లింగారెడ్డి, కోట్ల అరుణకుమారి, కారెం రవీందర్‌రెడ్డి, అరవెల్లి చంద్రశేఖర్‌రావు, ఆర్‌.సత్యనారాయణ, కార్యదర్శిగా అనితా రామచంద్రన్ ఉన్నారు.

 

హైదరాబాద్ రాష్ట్రంలో ఆరో నిజాం మీర్ మహబూబ్ ఆలీపాషా (1869 – 1911) కాలంలోనే ప్రజాసేవకు ఉద్యోగులను నియమించుకోవడానికి ప్రత్యేక వ్యవస్థ ఉండేది. ఆ తర్వాత 1919 లో ఒక ఫర్మానా ద్వారా హైదరాబాద్ సివిల్ సర్వీస్ కమిటీ ఏర్పడింది. అనంతరం 1947 ఏప్రిల్ 27న హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమీషన్‌ను ఏర్పాటు చేస్తూ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ పర్మనా జారీ చేశారు. ఈ కమీషన్‌లో ఒక చైర్మన్ నలుగురు సభ్యులు ఉండేవారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు ఆంధ్రరాష్ట్రంలో ఆంధ్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్, హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వేరువేరుగా ఉద్యోగ నియామకాలు చేపట్టేవి. ఆంధ్రరాష్ట్రం, హైదరాబాద్‌లు కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (Andhra Pradesh Public Service Commission) ఏర్పాటైంది. ఇది 1956 నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది.

 

 

డైలీ, వీక్లీ, మంత్లీ కరెంట్‌, బిట్‌ బ్యాంక్ కోసం క్లిక్ చేయండి

కమీషన్ నిర్మాణం ఇలా..
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఒక రాజ్యాంగపరమైన సంస్థ. రాజ్యాంగంలోని 14వ భాగంలో అధికరణ 315 నుంచి 323 వరకు కమీషన్ నిర్మాణం, విధుల గురించి తెలుపుతాయి.
☛అధికరణ 315 ప్రకారం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్‌లో ఒక చైర్మన్..,  రాష్ట్ర గవర్నర్ నిర్ణయించిన సంఖ్యలో ఇతర సభ్యులుంటారు (సభ్యుల సంఖ్యకు సంబంధించి రాజ్యాంగలో ప్రస్తావన లేదు). చైర్మన్, సభ్యులను గవర్నరు నియమిస్తారు. వీరి పదవీకాలం 6 సంవత్సరాలు లేదా పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలు ఏది ముందైతే దానిని పరిగణనలోకి తీసుకుంటారు. మౌలిక రాజ్యాంగంలో సభ్యుల పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలుగా ఉండేది. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా దానిని 62 సంవత్సరాలకు పెంచారు.
☛ చైర్మన్, సభ్యులను నియమించడానికి ప్రత్యేకమైన అర్హతలు రాజ్యాంగంలో పేర్కొనలేదు. కానీ మొత్తం సభ్యుల్లో సగం మందిని కేంద్ర రాష్ట్ర పరిపాలనా సర్వీసుల్లో అనుభవం ఉన్న వారిని నియమించాలి. మిగిలిన సగం మందిని రాష్ట్ర ప్రభుత్వం విచక్షణ మేరకు వివిధ రంగాల్లో అనుభవం ఉన్న వారిని నియమించుకోవచ్చు.
☛ కమీషన్ చైర్మన్, సభ్యులను కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ తరహాలోనే తొలగిస్తారు. అధికరణ 317 ప్రకారం అవినీతి (Corruption), అసమర్థత (Incapable), దివాళాతీయడం (Insolvent) వంటి కారణాలపైన సుప్రీం కోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపించి, రాష్ట్రపతి తొలగిస్తారు. అయితే గవర్నరుకు వీరిపై వచ్చిన అభియోగాలు నిరూపితం అయ్యే వరకు సస్పెండ్ చేసే అధికారం ఉంటుంది కానీ తొలగించే అధికారం లేదు.
☛ చైర్మన్, సభ్యులు తమ రాజీనామా పత్రాలను గవర్నరుకు సమర్పిస్తారు.
☛ వీరి జీతభత్యాలను రాష్ట్ర‌ప‌తి నిర్ణయిస్తారు. వీటిని రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.

 

 

Telangana: భారీగా ప్ర‌భుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు.. ఇక్క‌డి నుంచి చదవాల్సిందే..

కమీషన్ విధులు ఇలా..

 

రాష్ట్ర సర్వీసుల్లో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, ఇతర టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాల నియామకానికి పోటీ పరీక్షలు (Competitive Exams) నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.
➤ టీఎస్‌పీఎస్సీ పరిధిని పెంచి స్థానిక సంస్థలు, కార్పోరేషన్లు, బోర్డులు, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు చేపట్టే నియామక ప్రక్రియలను కూడా కమీషన్‌కు అప్పగించారు.
➤ గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ విద్యా సంస్థలు, రోడ్డు రవాణా సంస్థల నియామకాలు కూడా కమీషనే చేపడుతుంది.
➤ వివిధ సాంకేతిక శాఖలు కార్యాలయాల్లో ఇంజనీర్ల నియామకాలు చేపడుతుంది.
➤ జిల్లాల్లో, రాష్ట్రస్థాయి ఉద్యోగులకు సంబంధించిన శాఖాపరమైన పరీక్షలు (Departmental Tests) నిర్వహిస్తుంది.
➤ ఐఏఎస్, ఐపీఎస్‌లకు అర్ధవార్షిక పరీక్షలు (Half Yearly Exams) నిర్వహిస్తుంది.
➤ ప్రభుత్వ సర్వీసులకు సంబంధించిన నియామకాలు (Recruitments), పదోన్నతులు (Promotions), బదిలీలు (Transfers), క్రమశిక్షణా చర్యలు (Disciplinary cases) వంటి వాటిపైన ప్రభుత్వానికి సలహాలిస్తుంది.
అధికరణ 323 ప్రకారం కమీషన్ తన వార్షిక నివేదికను గవర్నరుకు సమర్పిస్తుంది.

 

 

 

Government Jobs: గుడ్‌న్యూస్‌.. 30,453 ఉద్యోగాల‌కు అనుమతి.. ముందుగా ఈ శాఖ‌ల్లోనే పోస్టులు భ‌ర్తీ..

కమీషన్ విధులను తెలిపే అధికరణలు..
✦ ప్రత్యక్ష నియామకాలు (Direct Recruitment (అధికరణ 320 (1))
✦ బదిలీల ద్వారా నియామకాలు (Recruitment by transfer (అధికరణ 320(3)(b))
✦ సర్వీసు నియమ నిబంధనలు (Statutory rules relating to services (అధికరణ 320 (3)(a)&(b)
✦ క్రమశిక్షణా చర్యలు, నిబంధనలు (Disciplinary cases (అధికరణ 320(3) and regulations 17(1)(a) to (e))

మరికొన్ని విశేషాలు ఇవే..
కమీషన్ నిర్వహించే ఒకటి లేదా రెండింటికి తప్ప అన్ని పోటీ పరీక్షలకు రాత పరీక్షలను తప్పనిసరి చేశారు. మిగిలిన వాటికి కేవలం మౌఖిక పరీక్ష నిర్వహిస్తారు. సమర్థవంతమైన పరిపాలకునికి ఉండాల్సిన లక్షణాలు లేదా నైపుణ్యాలను నిపుణుల కమిటీ గుర్తించి వాటిని కలిగిన వారినే ఎంపిక చేసేలా సిలబస్‌ను రూపొందించమని కమీషన్‌కు సిఫారసు చేసింది.

 

 

Government Jobs: ప్ర‌భుత్వ‌ ఉద్యోగాల‌కు కొత్త రోస్టర్ ఇదే.. ఈ మేర‌కే ఉద్యోగాల భ‌ర్తీ
ఉత్తమ పరిపాలకునికి ఉండాల్సిన నైపుణ్యాలు.. :
☛ సమస్య విశ్లేషణ, పరిష్కార సూచన నైపుణ్యం కలిగి ఉండటం (Problem analysis and suggestion of solutions.)
☛ సమాజం, ఆర్థిక వ్యవస్థ పై తగిన పరిజ్ఞానం ఉండటం(Knowledge of society and the economy)
☛ సాంకేతికతపై కనీస అవగాహన కలిగి ఉండటం (Awareness of technology and its potentiality.)
☛ పరిమాణాత్మక నైపుణ్యం, మానసిక సామర్థ్యం కలిగి ఉండటం (Quantitative skills and mental ability.)
☛ రాజ్యాంగం, చట్టం, ప్రజా పరిపాలన పరిజ్ఞానం కలిగి ఉండటం (Knowledge of Constitution, Law and Public Administration.)

అన్ని పరీక్షలకు ఒకే నమో

 

దు.. అదే ఓటీఆర్‌.. :
2015లో టీఎస్‌పీఎస్సీ ఒకేసారి నమోదు ప్రక్రియ (One Time Registration) అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో ఒకసారి నమోదు చేసుకుంటే ఒక శాశ్వత రెఫరెన్స్ నంబర్ వస్తుంది. దీని ద్వారా భవిషత్తులో జరిగే అన్ని పరీక్షలకు సులువుగా దరఖాస్తు చేయవచ్చు. ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది ఓటీఆర్ చేసుకున్నారు.
ఇప్పటి వరకు ఆఫ్‌లైన్ లో జరిగే పరీక్షల్లో దాదాపు 90 శాతం పరీక్షలు ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. దరఖాస్తు చేసే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే పరీక్ష ఆఫ్‌లైన్‌లోనే నిర్వహిస్తారు.

 

 

ఈ ఏడాది (2022) తెలంగాణ‌లో భ‌ర్తీ చేయ‌నున్న గ్రూప్స్-1,2,3,4 ఉద్యోగాలు ఇవే..:

గ్రూపు

పోస్టులు

గ్రూప్‌– 1

503

గ్రూప్‌– 2

582

గ్రూప్‌– 3

1,373

గ్రూప్‌– 4

9,168

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button